SWAMY VIVEKANANDA

 


*స్వామి వివేకానంద*


*జనవరి 12  - జాతీయ యువజన దినోత్సవం*


       *భారతీయ ఆధ్యాత్మిక సంపదకు రక్షకుడిగా, హిందూమత ఔన్నత్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన మహోన్నత వ్యక్తి స్వామి వివేకానంద. ఈయన 1863 జనవరి 12వ తేదీ అనగా సంక్రాంతి ముందు రోజున కలకత్తాలో జన్మించాడు.  తల్లి భువనేశ్వరి దేవి, తండ్రి విశ్వనాధ్ దత్తు.  ఈయన అసలు పేరు నరేంద్రుడు.*


         *బాల్యం నుండియే ఈయన ప్రతిభావంతుడు.  అందరికీ. ప్రీతిపాత్రుడు, సాహసి, ఏకసంథాగ్రాహి.  అన్నిటికంటే మించిన దాత.  1870వ సంవత్సరంలో తన ఏడవ ఏట ఈశ్వరచంద్ర విద్యాసాగర్ పాఠశాలలో మొదటి తరగతిలో ప్రవేశించెను.  బాల్యం నందే తన తల్లి వద్ద రామాయణం, మహాభారత కథలను నేర్చుకుని ఉండెను.  సన్యాసమనిన నరేంద్రునికి పరమానందము.  మూఢనమ్మకముల యందు విశ్వాసము లేదు.*


      *బాల్యముననే జాతి,మత విభేదముల కంటే మానవత్వమే గొప్పదనియు, జాతీయ జీవన విధానములను విడువక స్వమతాచార ధర్మములను అనుసరింపవలనని తండ్రి వలన అలవర్చుకొనెను.  నరేంద్రుడు పదునారేండ్ల ప్రాయమున కళాశాల యందు ప్రవేశించెను.  పాఠ్యపుస్తకములతో తృప్తి పడక పాశ్చాత్య దేశ చరిత్రలను చదివెను.  అంతేగాక పాశ్చాత్య తర్క శాస్త్రమునందును, తత్వ శాస్త్రమునందును విశేష ప్రావీణ్యమును సంపాదించెను.   ఆంధ్ర భాషా పారంగతుడై అనేక సభలలో గొప్ప వక్త అయ్యెను.  మహావక్త అయిన నరేంద్ర నాధుడు భారత వర్షమున వివేకానందుని మించిన వేదాంత మత ప్రబోధకుడు లేడని వక్కాణించి యుండెను.  ప్రధానోపాధ్యాయుడైన "హేస్టి" శ్రీ రామకృష్ణ గురువరేణ్యుని దివ్యానుభవమును గూర్చి ప్ర ప్రథమున నరేంద్రునికి చెప్పినది.  నరేంద్రునిలో ఈ సమయంలనే  విమర్శనాశక్తి పెరిగి మానసిక పరివర్తన కలుగ నారంభించెను.    కష్ట దశలో నున్నవారికి సహాయము చేయు చుండెడివాడు.*


        *నరేంద్రుడు నాలుగైదు సంవత్సరములు శాస్రోక్తముగా గానమునభ్యసించి గీతావాద్యము లందు ప్రవీణుడయ్యెను.  అతడు రచించిన స్తోత్రములను, కీర్తనలను నేడు శ్రీ రామకృష్ణాశ్రమములలో సంకీర్త సమయమున వినియోగించబడుచుచున్నవి.  నరేంద్రుడు వివాహమాడ తిరస్కరించెను.  భగవత్సాక్షాత్కారం బొందనిచో జీవితము నిరర్థకమని అతడు భావించి పరివ్రాజకుడయ్యెను.  రామకృష్ణుని వ్యక్తిత్వమునకు, బోధనలకు గల రూపును గ్రహించగలిగిన శిష్యులలో నరేంద్రుడు అగ్రగణ్యుడు.  అందుచేత రామకృష్ణ పరమహంస నరేంద్రుని తనార్జించిన తత్వజ్ఞాన నిధికి వారసుడిగా ఒనర్చెను.*


     *ఈ సమయముననే పరమహంసకు కంఠంలో వ్రణము బయలుదేరెను.  చికిత్స  చేయించినను వ్యాధి తగ్గలేదు.  నరేంద్రునికి అంత్యోపదేశము చేసెను.  పరమహంస 1886 ఆగస్టు 16వ తేదీన పరమపదించిరి.  పిమ్మట ఆయన శిష్యులు, నరేంద్రుడు కాశీపుర వనము నుండి బారా నగరంన శ్రీ రామకృష్ణ సేవాశ్రమమును స్థాపించింది.  ఇట్లు నరేంద్రుని నాయకత్వమున 1886 నుండి 1890 సంవత్సరం వరకు ఉండెను.  అచటి నుండి మార్చబడి నేడు బేలూరు లో వివేకానంద స్వామి చే ఆర్జించబడిన పుణ్యస్థలమున శ్రీ రామకృష్ణ మఠము సుప్రతిష్టమై అలరారుచున్నది.*


        *1893 వ సంవత్సరంలో చికాగోలో జరిగే సర్వమత సమ్మేళనములో పాల్గొనుటకు స్వామీజీకి ఆహ్వానము లభించెను.  ఆ సమ్మేళనంలో పాల్గొని హైందవ ఆధ్యాత్మిక తరంగాలలో అందరిని ముంచెత్తిన నవయుగ వైతాళికుడు వివేకానందుడు.  ఆయన ప్ర ప్రథమున సరస్వతీ దేవికి నమస్కరించి సభలోని వారందరినీ "అమెరికా సోదరీమణులారా" అని సంబోధించెను.ఆ మాట అనగానే సభలో ఆనందంతో కరతాళధ్వనులు మిన్ను ముట్టెను.*


      *స్వామీజీ భారతీయ సంస్కృతిని అనగా సనాతన ధర్మాన్ని గురించి  ప్రసంగించిరి.  అనగా వసుధైవ కుటుంబము, సర్వమానవ సౌభ్రాతుత్వం, విశ్వ మానవ కళ్యాణం, సర్వేజనా సుఖినోభవంతు, లోకా సమస్తా సుఖినోభవంతు అని భారతీయ సంస్కృతి చాటుచున్నది.  భారతీయ సంస్కృతి ఉదార స్వభావం వలననే భారతదేశంలో అన్ని రకాల మతాలు ప్రవేశింపగలిగాయి.*


      *"సోదరి నివేదిత" స్వామీజీ ప్రసిద్ధ పాశ్చాత్య శిష్యురాలు.  ఆమె అసలు పేరు మిస్ మార్గరెట్ నోబుల్. ప్రాక్పశ్చిమ  దేశాలలో తన వేదాంత తేజమును చూపి,     భారతీయ ధర్మాన్ని గురించి తన దివ్య సందేశమును ప్రసంగించిన ఆయన ఆరోగ్యం క్షీణించి ఆ వివేకానంద భాస్కరుడు శుభకృతు నామ సంవత్సర జేష్ఠ బహుళ చతుర్దశి శుక్రవారం (4-7-1902) నాడు పరలోక గతులైరి.  ఈ విధంగా స్వామి వివేకానంద స్వామీజీ మన హిందూ ధర్మాన్ని ప్రపంచంలో జీవింపజేసి తాను అమరుడయ్యాడు.*



*"సర్వేజనో సుఖినోభవంతు"*


*ఓం శాంతి, శాంతి,శాంతి*


*Prepared by*


*T. Prabhavathi Devi (86),*

*Retd. Hindi Teacher (ATP),KADAPA*


*Son: T. UDAYA BHASKAR,9642383659*

Comments

Popular posts from this blog